భీమ్గల్ : పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తెస్తూ పురపాలక రూపురేఖలు మార్చాలనే సంకల్పంతోనే ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తొమ్మిదేండ్లలో రూ.250 కోట్లను ఖర్చు చేశామని వివరించారు.
స్వరాష్ట్ర సాధనతోనే ఈ ప్రగతి సాధ్యపడిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో నియోజకవర్గం నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ భీమ్గల్ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయిందన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ (Central Finance Commission)అందిస్తున్న నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుండటంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతోందన్నారు. లేకుంటే సెంట్రల్ ఫైనాన్స్ నిధులు బల్దియాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేవన్నారు.