Minister Uttam Kumar Reddy | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆందోళనలనకు అధికార కాంగ్రెస్ మరోమారు తలొగ్గింది. మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలు కాపాడాలన్న బీఆర్ఎస్ నేతల డిమాండ్కు దిగొచ్చింది. బరాజ్కు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ చెప్పడమే అందుకు నిదర్శనం. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నెల రోజుల్లో నివేదిక అంజేస్తుందని, దాని ఆధారంగా బరాజ్కు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామని తెలిపారు. మేడిగడ్డను ఎల్అండ్టీ సంస్థ నిర్మించిందని, రికార్డుల్లో సబ్కాంట్రాక్టర్ల పేర్లు లేవని పేర్కొన్నారు. కాబట్టి ఆ సంస్థకు సంబంధించి రూ. 400 కోట్ల నిధులు పెండింగ్లో పెట్టినట్టు వివరించారు. తాను శనివారం ఢిల్లీ వెళ్తున్నానని, మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని చెప్పారు.
మేడిగడ్డపై తాము సమాచారం గానీ, పత్రాలు గానీ ఇవ్వలేదని కేంద్రజల్శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పడం అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు గత ప్రభుత్వం జియోలాజికల్ ప్రొఫైల్ చేయలేదని, థర్డ్ పార్టీ రిపోర్ట్స్ లేకపోవడం వల్లే పత్రాలు ఇవ్వలేదని తెలిపారు. ఎన్డీఎస్ఏ బృందాన్ని ఆహ్వానించింది తామేనని, వారికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్ అందిందని, చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగిన నష్టానికి ప్రాజెక్టుపై ఉన్న లోన్లను కేసీఆర్, కేటీఆర్ కట్టాలని డిమాండ్ చేశారు. తమ మ్యానిఫెస్టోలో తుమ్మిడిహట్టి ఉన్నదని స్పష్టం చేశారు. అక్కడ నీళ్ళు లేవని సీడబ్ల్యూసీ చెప్పిందంటూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చినట్టు స్వయంగా అధికారులు చెప్పారని గుర్తుచేశారు. అక్కడే ప్రాజెక్టు కట్టి ఉంటే 16 లక్షల ఆయకట్టుకు ఇప్పటికే నీళ్ళు అందేవని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన తప్పుల్లో కేంద్రం పాత్ర కూడా ఉన్నదని ఆరోపించారు. మేడిగడ్డకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును చూసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్పై సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించాలని కోరినట్టు తెలిపారు.