హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల పనితీరు పూర్తిగా మారాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 14 వ్యవసాయ కార్పొరేషన్ల పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేషన్లు కేవలం లాభాపేక్షతో పనిచేయకుండా రైతులకు ఉపయోగపడే విధానాలను అమలు చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే విధానాలను ఉపేక్షించేది లేదని, ఎరువులు, వ్యవసాయ యంత్రాల సరఫరా తదితర అంశాల్లో ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధానాలను ప్రోత్సహించొద్దని తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న భూములను శాఖపరంగా వినియోగించుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, అన్ని కార్పొరేషన్ల ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ల అభివృద్ధికి వెంటనే ప్రణాళిక రూపొందించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని వాటిని సక్రమంగా అమలు పరిచే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ దిశగా ఇప్పటివరకు కార్పొరేషన్లు చేసిన కృషిపై నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.