హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): అవసరం మేరకు ఎరువులను సరఫరా చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల నిల్వలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత యాసంగితో పోల్చితే అధిక ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గత యాసంగిలో ఈ రోజు నాటికి 3.57 లక్షల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, ఈసారి మాత్రం 4.68 లక్షల టన్నులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అదే ఇతర ఎరువులు నిరుడు 7 లక్షల టన్నులు ఉండగా, ప్రస్తుత 9 లక్షల టన్నులు ఉన్నట్టు వివరించారు. పంటల రకాలు, రైతుల అవసరాల మేరకు ఆయా ప్రాంతాల్లో అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.