హైదరాబాద్ : అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని, సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala )అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
మంత్రికి సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఉత్పత్తి పెంచి వ్యవసాయశాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. వ్యవస్థలో, శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని రైతులకు సంక్షేమానికి అధికారగణం పాటుపడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలన్నారు.
తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్ శాఖా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలి. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలి. పాం ఆయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. వాళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఆ సాగును మరింత ప్రోత్సహించాలని, అందులో అంతర పంటగా పుచ్చకాయలుపండించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.