హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గొర్రెల పెంపకం వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం జోగులాంబ గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహాం ఆధ్వర్యంలో మాదాసి కురువలు ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసి సబ్సిడీ గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గొర్రెల పెంపకందారులకు చేయూతనిచ్చి, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభించిందని వివరించారు. జోగులాంబ గద్వాల, ఆలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన మాదాసి కురువలు అందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు తమ వాటా ధనం డీడీలను అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా మాదాసి కురువలకు గొర్రెల యూనిట్లను అందజేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి పలుసార్లు తీసుకొచ్చారని చెప్పారు.