హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా యేటా సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టుచీర సమర్పించడం ఆనవాయితీ. ఈ నెల 25న బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించేందుకు చేపట్టిన చీరె తయారీని సోమవారం అమ్మవారి ఆలయంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మశాలి సంఘం ప్రతినిధులతో కలిసి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 మంది చేనేత కార్మికులు ఎంతో నిష్టతో శ్రమించి చీరెను తయారు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు జయరాజ్, రచ్చ నాగరాజు, నాగమూర్తి, హరి తదితరులు పాల్గొన్నారు.