హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవసరాలకు సరిపడేలా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శనివారం పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీ ఐస్క్రీంలకు సంబంధించిన 66 పుష్ కార్ట్ (ట్రై సైకిల్స్)ను మంత్రి ప్రారంభించారు. విజయ ఔట్లెట్ నిర్వాహకులకు 50 శాతం సబ్సిడీపై రిఫ్రిజిరేటర్స్ను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని, ఆ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే 250 పుష్ కార్ట్లను 50 శాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించామని, తొలి విడతలో 66 పంపిణీ చేశామని తెలిపారు. ఒక్కో పుష్ కార్ట్ విలువ రూ.63,050 కాగా ప్రభుత్వం రూ.31,525 సబ్సిడీ ఇస్తున్నదని వివరించారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని సీఎం కేసీఆర్ లాభాల్లోకి తీసుకొచ్చారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.