హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ప్రజల అభిమానంతో గెలవలేమని గ్రహించి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అందులో భాగంగా వారి అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి జ్వరం అని చెప్తున్నారని అన్నారు. ‘ఇవాళ జ్వరం అంటారు.. రేపు దాడులు జరిగాయంటూ డ్రామాలు చేస్తారు.. మునుగోడు ప్రజలు ఇవి చూసి మోసపోవద్దు’ అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మంత్రి శ్రీనివాస్యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా బీజేపీ నేతలు చేతులకు పట్టీలు కట్టుకొని ఇలాంటి డ్రామాలు చేశారని గుర్తుచేశారు.
డ్రామాలు నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలేనని హెచ్చరించారు. వారంతట వారే దాడులు చేయించుకొని.. ప్రభుత్వం చేయించిందని ఏడుస్తారని అన్నారు. ప్రచారానికి మిగిలింది ఇంకా మూడు రోజులే కాబట్టి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. ఓవైపు బీజేపీ అభ్యర్థికి జ్వరం వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడులో గెలిపిస్తే వెయ్యి కోట్లు తీసుకొస్తామని అంటున్న రాజగోపాల్రెడ్డి అంత డబ్బు ఎకడినుంచి తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్లో గెలిచిన బీజేపీ అక్కడి ప్రజలకు ఆ డబ్బు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
ఎమ్మెల్యే ఎవరైనా అందరికీ ప్రభుత్వ పథకాలు
రాజగోపాల్రెడ్డి గెలిచినా ప్రజలకు ఎలాం టి మేలు జరుగబోదన్నారు. తన స్వప్రయోజనాల కోసమే రాజీనామా చేశారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తున్నదని చెప్పారు. ఇంతకాలం మునుగోడులో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నానియోజకవర్గంలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయని తెలిపారు. తాము కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్లం కాదని, కుట్ర లు, కుతంత్రాలు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు తమ స్థాయిని మరచి మాట్లాడుతున్నారని, తాము కూడా తిట్టగలమని ఘాటుగా హెచ్చరించారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.