హైదరాబాద్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నూతనంగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు ఆసరా కార్డులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్ ను ఇచ్చే వారని, అవి తీసుకొనేందుకు కూడా లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని వృద్ధులు, వితంతువులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయని, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న శుభ తరుణంలో 57 సంవత్సరాలు దాటిన మరో 10 లక్షల మందికి ఆగస్టు15 నుండి అందిస్తున్నట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ మండలాల పరిధిలో ప్రస్తుతం 30 వేల మందికి ఆసరా పెన్షన్ లను అందిస్తుండగా, నూతనంగా 16 వేలకు పైగా పెన్షన్ లు మంజూరయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.