హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో విజయ తెలంగాణ డెయిరీ ఆధ్వర్యంలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కలిసి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గే మల్లేశం, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ ఎల్డీఏ సీఈవో మంజువాణి, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం, డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. విజయ డెయిరీతో చిన్న, సన్నకారు రైతులకు ఎంతో చేయూత ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విజయ డెయిరీ బలోపేతంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని స్పష్టం చేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ నుంచి రూ. 750 కోట్ల టర్నోవర్కు పెంచామన్నారు. రావిర్యాలలో మెగా డెయిరీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. విజయ డెయిరీ ఉత్పత్తులు మొత్తం 28 ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో విజయ డెయిరీ ఔట్లేట్లు ఏర్పాటు చేశామన్నారు. పాడి రైతులకు చేయూత కోసం లీటర్పై రూ. 4 ప్రోత్సాహం ఇస్తున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. విజయ డెయిరీ 365 రోజులు పాలు సేకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలన్నది లక్ష్యం. డెయిరీ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)కు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇది అందుబాటులోకి వస్తే రోజువారీ పాల ఉత్పత్తి సామర్థ్యం 8 లక్షల లీటర్లకు పెరుగుతుంది. ప్రస్తుతం లాలాపేటలో ఉన్న విజయ ప్లాంట్కు రోజుకు 3.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉన్నది. మెగా డెయిరీతో పాలఉత్పత్తి సామర్థ్యం రెండు నుంచి మూడు రెట్లు పెరిగి, మరికొన్ని రకాల ఉత్పత్తులను భారీఎత్తున చేపట్టే అవకాశం లభిస్తుంది. 75 వేలమంది పాడి రైతులకు సభ్యత్వం ఉన్న విజయ డెయిరీ.. పీక్ సీజన్లో రోజుకు 4.5 లక్షల లీటర్లు, వేసవిలో 2.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. మెగా డెయిరీ వస్తే.. మరింత మంది పాడి రైతులకు లబ్ధిచేకూరనున్నది.
విజయ బ్రాండ్ పేరుతో నేటి నుంచి 14 రకాల స్వీట్లు అందుబాటులోకి వచ్చాయి. గులాబ్జామ్, రాగి, బేసన్, మలాయ్, జోవర్, మల్టీమిల్లెట్ లడ్డులు, సున్నుండలు, బాదంహల్వా, కాజూకట్లీ, చాకోబర్ఫీ, సోన్పాప్డీ వంటి స్వీట్లను అందుబాటులోకి వచ్చాయి. పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఇప్పటికే 57 రకాల ఉత్పత్తులను విజయ బ్రాండ్తో విక్రయిస్తున్నారు. ఇటీవలే ఐస్క్రీం ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మెగా డెయిరీ నిర్మాణం పూర్తయితే రోజుకు 5 వేల లీటర్ల ఐస్క్రీమ్లను తయారుచేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటుంది.