హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో శుక్రవారం రాత్రి సమ్మర్ కార్నివాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలిరావడంతో థ్రిల్ సిటీ సందడిగా మారింది. థ్రిల్ సిటీ ప్రారంభించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా నిర్వహకులు భారీగా వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసిన అనంతరం థ్రిల్ సిటీ సమ్మర్ కార్నివాల్ లోగో, ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ (WWW.THRIL.CITY) ను ప్రారంభించారు. అదేవిధంగా థ్రిల్సిటీకి వచ్చే వారికి అందజేసే లక్కీ కూపన్ను కూడా మంత్రి విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు సమ్మర్ కార్నీవాల్ను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు మంత్రికి వివరించారు. సమ్మర్ కార్నివాల్ సందర్భంగా చిన్నారులకు రూ.699 , పెద్దలకు రూ.999 థ్రిల్సిటీలో లోపలి ప్రవేశంతో పాటు అన్ని రైడ్లను ఉచితంగా అనుమతించనున్నట్లు చెప్పారు. నిత్యం వివిధ రకాల పని ఒత్తిడులకు గురవుతూ మానసిక ప్రశాంతత కోరుకునే వారికి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు అనువుగా ప్రపంచ స్థాయి గేమింగ్, వినోద సౌకర్యాలతో థ్రిల్ సిటీ థీమ్ పార్క్ను నిర్మించడం జరిగిందని చెప్పారు.
అన్ని వయసుల వారిని ఆకర్షించేలా రైడింగ్ మాన్ స్టర్ థియేటర్, స్ల్పాష్ కోస్టర్, ఫ్లైట్ సిమ్యులేటర్లు, స్కోడా కార్ సిమ్యులేటర్, విర్చువల్ రియాలిటీ గేమ్స్, ఫన్ హౌస్, క్రికెట్ సిమ్యులేటర్, బౌలింగ్ అల్లే, బంపర్ కార్లు, ఫుట్సాల్, మ్యాజిక్ ట్రైన్, హార్స్ రంగులరాట్నం, ఇలా అనేకమైన గేమింగ్ జోన్, ఫుడ్ కోర్ట్ ఈ థ్రిల్ సిటీ థీమ్ పార్క్లోని ప్రత్యేకతలని మంత్రికి చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రజనీకాంత్, అనిల్, బాలరాజ్, అబ్రహం, హిమాన్షు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.