Job Mela | హైదరాబాద్ : మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు గౌరవం, తృప్తి కలుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్ధుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ మేళా ఒక గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్న అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను మంత్రి ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వస్తుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాల భర్తీ జరగగా, మరో 90 వేల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని వివరించారు.
ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అభివృద్ధి పనుల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉండటం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, లక్షలాది మందికి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని మధు, లోహిత్ కుమార్, అపోలో హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేందర్ రెడ్డి, మెథడిస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభు, వివిధ సంస్థల ప్రతినిధులు సూర్య చంద్రారెడ్డి, రాకేశ్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు