మెదక్ : రాష్ట్రంలోని మత్స్య సంపద పై పూర్తి హక్కులు మత్స్యకారులకే కల్పించిన ఘనత సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం మెదక్లోని గో సముద్రం చెరువులో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలతో కలిసి ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మత్స్యకారులకు 25 మత్స్య సొసైటీలకు చెందిన వెయ్యి మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డుల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యరంగాన్ని నాటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున మత్స్య రంగ అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమంది మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి వనరులను అభివృద్ధి చేసుకొని ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న ఫలితంగా మత్స్య సంపద మూడింతలు పెరిగిందని, మత్స్యరంగం అభివృద్ధి సాధించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు పెరిగిన మత్స్య సంపద ఫలాలు అర్హులైన మత్స్యకారులకు అందాలనే ఉద్దేశంతో నూతనంగా లక్షమంది మత్స్యకారులకు వివిధ మత్స్య సొసైటీలలో సభ్యత్వాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మత్స్యకారులకు గుర్తింపు కార్డులను అందజేస్తూ ఈ వృత్తి గౌరవాన్ని మరింత పెంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ హేమలత, కలెక్టర్ రాజర్షి షా, ఎప్పీ రోహిణి ప్రియదర్శిని, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మత్స్య శాఖ ఏడీ రజని, తదితరులు పాల్గొన్నారు.