హైదరాబాద్ : ప్రజా గాయకుడు, రచయిత, జన నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, గద్దర్ మృతి చాలా బాధాకరం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటన్నారు. గద్దర్ ప్రసంగాలు, పాటలు ప్రజలలో స్ఫూర్తి నింపాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar ) ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్(74) ఆదివారం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.