హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని సచివాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల మద్యం దుకాణాల కోసం నిర్వహించిన డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారందరూ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మద్యం దుకాణాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టులను మరింత బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. చెక్ పోస్టులలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ చెక్ పోస్టుతో కలిపి సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ మద్యం తయారీ, అమ్మే వ్యక్తులపై పీడీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్, ES లు ఏ సత్యనారాయణ, టీ రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయభాస్కర్ గౌడ్, పవన్, విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.