Minister Srinivas Goud | హైదరాబాద్, (నమస్తేతెలంగాణ)/మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 21: దేశంలో ఎక్కడా లేని విధంగా.. సిండికేట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో తెలంగాణలో మద్యం దుకాణాలను కేటాయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్లుగా ఏర్పడి మద్యం దుకాణాలను నిర్వహించే వారని, దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును కొల్లగొట్టేవారని ఆయన గుర్తు చేశారు. సోమవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా, 22 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయని, వాటిని పక్కనబెట్టి సోమవారం 2,598 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో పూర్తి పారదర్శకతో ఎంపిక చేసినట్టు తెలిపారు. మొత్తం 1,31,270 దరఖాస్తులు వచ్చాయని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది, అనుమానం లేకుండా ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అందరికీ తెలిసేలా లాటరీ నిర్వహించినట్టు చెప్పారు. దుకాణాలు పొందిన వారికి అప్పటికప్పుడు ఉత్తర్వులు అందజేస్తున్నట్టు స్పష్టం చేశారు. గతంలో నకిలీ మద్యం అమ్మేవారని తెలిపారు. స్వరాష్ట్రంలో ఎక్సైజ్, పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో నకిలీ మద్యాన్ని అరికట్టగలిగామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరా ఇవ్వాలన్న ఉద్దేశంతో నీరా పాలసీని తీసుకొచ్చామని, ఇందుకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల 30 లక్షల తాటి, ఈత చెట్లను పెంచుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ జి.రవినాయక్, ఎక్సైజ్ అధికారి సైదులు, ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి, ఎస్సై శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.