హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని కార్యాలయంలో మహబూబ్నగర్ పట్టణంలో పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న మహబూబ్నగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్బండ్ సుందరీకరణ, శిల్పారామం ఏర్పాటు, పట్టణంలోని ప్రధాన జంక్షన్ల విస్తరణ, సుందరీకరణ పనులపై టూరిజం ఎండీ మనోహర్కు దిశానిర్దేశం చేశారు. పట్టణం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, తద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.