హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం కార్యాలయంలో మంత్రి డ్రాఫ్ట్ క్రీడాపాలసీపై అధికారులతో చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడాపాలసీ రూపకల్పనపై.. గత కేబినెట్ సబ్కమిటీలో సభ్యులు చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
డ్రాఫ్ట్ పాలసీని వచ్చే కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రవేశపెట్టాలంటూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రీడా అభివృద్ధి పనులు, మైదానాల నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులపై సమీక్షించి, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగతా ప్రారంభం కాని స్టేడియాల పనులకు శంకుస్థాపన చేయాలని సూచించారు.
టూరిజం శాఖ అధికారులతో సైతం పలు ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ నిర్మాణ పనులు, మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామం, ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు, హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం పనులు, వంగరలోని పీవీ విజ్ఞాన వేదిక పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టూరిజం ఎండీ, చీఫ్ ఇంజినీర్, అధికారులకు ఆదేశాలిచ్చారు.