మహబూబ్నగర్: కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార్లమెంటును సృష్టించి, అనుభవ మంటపంగా ఏర్పాటు చేసిన రాజనీతిపరుడు అని తెలిపారు. బసవేశ్వరుని 890వ జయంతి సందర్భంగా (Birth anniversary) మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మనిషి ఎలా జీవించాలి, మానవధర్మం ఏమిటి అనే విషయాలను ఆనాడే బసవేశ్వరుడు స్పష్టంగా తెలియజేశారన్నారు. మహిళలు, పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండాలి, కుల నిర్మూలన జరగాలని, మనిషి మనిషిగా జీవించాలని జాతికి గొప్ప సందేశాన్నిచ్చిన మహానీయుడని కొనియాడారు.
గతంలో ఏ మహనీయుల జయంతిని ప్రభుత్వాలు అధికారికంగా జరపలేదని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ (CM KCR) బసవేశ్వరుని జయంతిని అధికారికంగా జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా, ట్యాంక్బండ్పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. అంతేకాక మహనీయుని పేరుపై కోకాపేటలో రూ.100 కోట్ల విలువైన భూములను కేటాయించారని, హైదరాబాద్తోపాటు మహబూబ్నగర్లో కూడా బసవ భవన్ కేటాయించారన్నారు. బసవేశ్వరుని సేవా తత్పరతను ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ఎంతోమంది డాక్టర్లు విద్యాసంస్థలను, కాలేజీలు, పాఠశాలలను ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారని అభినందించారు. ప్రతిఒక్కరు బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆ మహనీయుడు చూపించిన దారిలో అందరూ పయనించాలని పిలుపునిచ్చారు.