మహబూబ్నగర్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని 291 ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం కార్యక్రమంపై జడ్పీ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు గుణాత్మక విద్యనందించేందుకు సీఎం దూర దృష్టితో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం తీసుకువచ్చారన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలోని పాఠశాలలను సైతం తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు పూర్వ విద్యార్థుల ద్వారా విరాళాలు సేకరించి పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఫర్నిచర్, పెయింటింగ్, బోర్డులు, వంటగది, డైనింగ్, అదనపు తరగతి గదులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
గతంలో పోలిస్తే వైద్యరంగంలో పలు మార్పులొచ్చాయని, అలాగే ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్పొరేట్ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇదో మంచి అవకాశం ఉన్నారు. ప్రభుత్వం వచ్చాక తొలుత రైతులకు, ఇప్పుడు పాఠశాలలు, విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, డీఈవో ఉషారాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.