మహబూబ్నగర్ : మినీ ట్యాంక్బండ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మినీ ట్యాంక్బండ్లో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ వెంకటరావు, ఇతర అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, శిల్పారామం తదితర పనులన్నీ పూర్తి అయితే ఆహ్లాదకరంగా మారుతుందన్నారు. ఎకరాల స్థలంలో ఐలాండ్ ఏర్పాటు చేయడమే కాకుండా.. లక్నవరం తరహాలో సస్పెన్షన్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని, హెలీపాడ్, రెస్టారెంట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు ట్యాంక్బండ్ను విడతలవారీగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చేస్తూ వస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సేకరించాలన్నారు. ఇతర జిల్లాలు, ప్రాంతాల సందర్శకులను ఆకట్టుకునేలా ట్యాంక్బండ్ను అభివృద్ధి చేయాలని, ఐలాండ్లో రెస్టారెంట్, డెస్టినేషన్ మ్యారేజ్లు నిర్వహించుకునే వేదికలు ఏర్పాటు చేస్తామని, శిల్పారామంలో కూడా పెళ్లిళ్లు జరుపుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల పార్కును తీర్చిదిద్దుతామని, ఇతర జిల్లాల నుంచి వచ్చే సందర్శకులను ఆకుట్టకునేలా అభివృద్ధి చేస్తామన్నారు.
పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గుర్రపు డెక్క, పూడికను పూర్తిస్థాయిలో తీసివేయాలని, ఎర్రమట్టి తేలే వరకు పూడిక తీయాలని, అధికారులకు సూచించారు. కల్వర్టులు, బండ్ విస్తరణ పనులను రాత్రి, పగలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టూరిజం ఎండీ మనోహర్, ఐబీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చక్రధర్, డీఈ మనోహర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.