హైదరాబాద్ : గీత వృత్తికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకే నీరా కేఫ్ అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నిర్మాణ పనులను రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, అబ్కారీ, పర్యాటకశాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డులో రూ.25 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్ను నిర్మిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వందల, వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ.. ప్రజలకు ఆరోగ్యాన్ని , 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లును నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు.
గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కుల సంఘాల ప్రతినిధులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం, సంస్థాన్ నారాయణపురం మండలం సర్వే, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మునిపల్లి, రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లు మండలం చరికొండ గ్రామంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి తెలిపారు. మంత్రి వెంట రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, ఉప్పల్ ఆర్టీవో పుల్లెంల రవీందర్కుమార్, గౌడ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.