మహబూబ్ నగర్ : విద్యార్థులతో పాటు, పేద ప్రజలు, ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కోడూరులో అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ. 6 కోట్ల వితరణతో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అంతేకాక మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 20 వేల మంది పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే స్వస్త్య ఆహార పథకాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక పూర్వం మహబూబ్ నగర్ జిల్లా తాగునీటికి, విద్యుత్తుకు ఇబ్బంది పడిందని, తినడానికి తిండి లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. హాస్టళ్లలో దొడ్డు బియ్యం ,పురుగుల అన్నంతో భోజనం చేయలేని పరిస్థితి ఉండేదన్నారు. కొందరు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లే వారని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని, హాస్టళ్లలో కూడా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో అనేక మంది పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం లేకుండానే పాఠశాలలకు వస్తున్నారని తెలుసుకుని హరే కృష్ణ మూ మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొదటి విడతగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 20 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అరబిందో ఫార్మా పౌండేషన్ రూ.6 కోట్ల వితరణ చేయగా స్వస్త్య ఆహార పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ఇలాంటి సేవలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అదేవిధంగా అరబిందో ఫార్మా మహబూబ్ నగర్ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని, హరే కృష్ణ మూమెంట్ కు కూడా ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఎంపీపీ సుధా శ్రీ, వైస్ ఎంపీపీ అనిత, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.