హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పర్యాటక, సాంస్కృతిక చిత్రపటంలో ప్రత్యేక స్థానంతో తెలంగాణ సగర్వంగా నిలుస్తున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరుగుతున్న ఐటీబీ, బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చరల్ ఎగ్జిబిషన్లో తెలంగాణ పర్యాటక విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ను శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ టూరిజం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్తున్నామని, ప్రపంచ వారసత్వ సంపదగా యునెసో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, బుద్ధవనంతోపాటు తెలంగాణలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాల ఔన్నత్యాన్ని ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నామని వివరించారు.
స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో పర్యాటక రంగం నూతన వైభవాన్ని సంతరించుకున్నదని, రాష్ట్రంలోని పలు ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలను సరైన రీతిలో ప్రమోట్ చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని పలు పర్యాటక సంస్థలు ఇప్పటికే తెలంగాణను టూరిజం హబ్గా గుర్తించి అవార్డులతో సత్కరించాయని తెలిపారు. 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంసృతిక సంస్థలు పాల్గొంటున్న ఈ ఇంటర్నేషనల్ టూరిజం, కల్చరల్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాల్ వద్ద తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీశ్రావు, ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, జర్మనీ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు.