హన్వాడ, జూలై 18 : సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. ఓర్వలేని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటూ రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్పల్లిలో ‘మన ఊరు-మనబడి’ కింద రూ.19.42 లక్షలతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు.
26 మంది గిరిజనులకు 13 ఎకరాల 20 గుంటల పోడు భూమికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. 50 ఏండ్ల భూ సమస్యకు పట్టాల పంపిణీతో చెక్ పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల విద్యుత్తు, ధరణి, రైతుబంధు, పింఛన్ ఎత్తివేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 24 గంటల విద్యుత్తు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.