మహబూబ్ నగర్ : రాష్ట్రంలో షీ టీమ్స్ల ఏర్పాటుతో మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట పడిందని , మహిళలకు అత్యధిక భరోసానిచ్చిన ప్రభుత్వం తమదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతపై శిల్పారామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మహిళా పోలీస్ స్టేషన్లు, కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మహిళలకు ఒక భరోసాను కల్పిస్తున్నామని అన్నారు. 2014కు ముందు కనీసం తాగునీళ్లు లభించక మహిళలు పడిన కష్టాలకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్ష సాయం అందిస్తూ అండగా నిలుస్తు న్నామని మంత్రి తెలిపారు.
నియోజకవర్గంలో మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్ల బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మహా బ్రాండ్ ఏర్పాటుచేసి వాటిని విక్రయించేందుకు అవకాశం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ కె నరసింహ, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్యం జనార్ధన్, డి.ఎస్.పి మహేష్, సీఐ రజిత, తదితరులు పాల్గొన్నారు.