మహబూబ్నగర్/ హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ఫ్రీడం వాక్’ ప్రారంభంలో తాను రబ్బర్ బుల్లెట్ ఉన్న డమ్మీ గన్ పేల్చానని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫ్రీడం ర్యాలీ ప్రారంభ సూచికగా తాను డమ్మీ గన్తో గాల్లోకి కాల్చానని వివరించారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని, రైఫిల్ నిబంధనలు తనకు తెలుసని పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగినప్పుడు ప్రారంభ సూచికగా క్రీడాకారులందరికీ శబ్దం వినిపించేలా డమ్మీ గన్తో పేలుస్తారని తెలిపారు. తాను డమ్మీ గన్తోనే పేల్చానని, క్రీడాశాఖ మంత్రిగా తనకు ఆ అధికారం ఉన్నదని మంత్రి స్పష్టంచేశారు. క్రీడాకార్యక్రమాలకు మంత్రి హాజరుకాకుంటే అక్కడ ఉండే పీఈటీలు వాటిని పేలుస్తారని చెప్పారు.
మహబూబ్నగర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ, కలెక్టర్ ఇచ్చిన తుపాకీతోనే తాను గాల్లోకి కాల్చినట్టు పునరుద్ఘాటించారు. ఈ ఘటనపై తన వివరణ తీసుకోకుండా.. కొన్ని టీవీ చానళ్లు ఇష్టారీతిన తప్పుడు ప్రచారం చేయడం బాధకరమన్నారు. నేను కాల్చింది నిజమైన బుల్లెట్ అయితే రాజీనామాకు సిద్ధం.. కాదని తేలితే మీ చానళ్లు మూసుకుంటారా? అని మంత్రి సవాల్ విసిరారు. కొందరు చేసే వెకిలి, చిల్లర చేష్టలను ప్రజలందరూ గమనిస్తున్నారని శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
ఈ ర్యాలీలో 25 -30వేల మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారని.. కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి జీర్ణించుకోలేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మన్నలను పొందలేక కొందరు ఇలాంటి దుష్ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్ ప్రజలకు తానేంటో తెలుసునని, వాస్తవాలను వారు అర్ధం చేసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్గౌడ్ వాడింది డమ్మీ తుపాకీ అని, అందులో ఉన్నది రబ్బర్ బుల్లెట్ అని ఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. పోలీసుల తుపాకీ లాక్కొని పేల్చినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.