మహబూబ్నగర్ : కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లాలోని ఏనుగొండలోని సన్నిధి అనాధాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కేటీఆర్ అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్కు స్వల్ప గాయం అవ్వడం వల్ల జన్మదిన వేడుకలు జరపడం లేదన్నారు. ఆయన త్వరగా కోలుకుని త్వరగా విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యార్థులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, దుప్పట్లు, పాఠశాల కోసం వాషింగ్ మిషన్, గీజర్ అందజేశారు.అనాధాశ్రమంలోని విద్యార్థులకు అందరం అండగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమొని వెంకటయ్య, రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.