హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003’కు చట్ట సవరణ చేసే బిల్లును మంత్రి శ్రీధర్బాబు సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు విషయమై మండలిలో మంత్రి మాట్లాడుతూ.. సిగరెట్ కంటే హుక్కాపొగ మరింత హానికరం అన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలతుందని, హుక్కా తాగే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం పొంచి ఉండటంతో హుక్కాపార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారని, కేబినెట్లోనూ ఆమోదం తీసుకొని సభ ముందుకు తె చ్చామని చె ప్పారు. పాఠశాల విద్యార్థులకు సిగరెట్లు, ఈ-సిగరెట్లు, గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటివి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కాలు, హుక్కా, పొగాకు వంటి వాణిజ్య, ఉత్పత్తి ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఏడాది నుంచి ఏడేండ్ల వరకు కఠినంగా శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. పొగాకు, సిగరెట్లు, హుక్కా, గంజాయి తీసుకోవడం వల్ల యువత పెడదోవ పడుతున్నారని చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు ఏవైనా ఓ తల్లిగా స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.