వనపర్తి రూరల్/పెద్దమందడి/సిద్దిపేట అర్బన్/పాలమూరు, ఏప్రిల్ 22 : ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎక్కడైనా తరుగు తీస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. శనివారం వనపర్తి జిల్లా రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో, పెద్దమందడితోపాటు మండలంలోని మనిగిళ్ల, అల్వాల, పామిరెడ్డిపల్లి, జంగమాయిపల్లి, బలిజపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సే ధ్యేయంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ స్టేజీ వద్ద పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వం రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని అన్నారు.