మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి ఏపీ సర్కారు పదేండ్ల కాలంలో రూ.4 వేల కోట్లు మాత్రమే మహిళా సంక్షేమానికి కేటాయించిందని, సీఎం కేసీఆర్ ఏడున్నరేండ్లలోనే ఏకంగా రూ.9 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలతో మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి సైతం తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆదివాసీ, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.