హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులతో మంత్రి శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లో ని మినిస్టర్స్ క్వార్టర్స్లోని తన నివాసంలో సమావేశమై, ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గిరిజన బిడ్డలను విద్యావంతులను చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 92 గురుకులాలు ఏర్పాటు చేసి, ఉచితంగా నాణ్యమైన విద్యా బోధనకు ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు.
అందువల్లే, గతంతో పోలిస్తే గిరిజనుల్లో అక్షరాస్యత శాతం అత్యధికంగా పెరిగిందని చెప్పారు. గురుకుల విద్యలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 1,200 మంది గిరిజన విద్యార్థులు పలు ప్రతిష్ఠాత్మక కళాశాల్లో ఇంజినీరింగ్, వైద్య విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొందారని వివరించారు. ఏటికేడు ఆ సంఖ్య పెరుగుతున్నదని, గురుకులాలు సాధిస్తున్న సత్ఫలితాలకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, ఓఎస్డీ రంగారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశం, ఓఎస్డీ కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ సురేందర్, వరంగల్ ప్రిన్సిపాల్ పద్మిని పాల్గొన్నారు.