హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): సంతానం కలగని దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో దత్తత హెల్ప్లైన్ నంబర్ 040-23748663/ 040-23748664ను ఆమె ప్రారంభించారు. హెల్ప్డెస్కు వచ్చిన ఫోన్కాల్ను మంత్రి రిసీవ్ చేసుకొని స్వయంగా దత్తత వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. దత్తతపై సరైన అవగాహనలేక పిల్లలులేని తల్లిదండ్రులు ఒత్తిడికి, నిరాశకు గురవుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే దత్తత సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. దత్తత ప్రక్రియలోని వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్డెస్క్ ద్వారా పొందవచ్చునని తెలిపారు.
ఐదేండ్లు దాటిన పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రులకు ఆ పిల్లలతో ఎలా మెలగాలో హెల్ప్డెస్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు పిల్లలకు కొత్త జీవితంలో ఎలా ఉండాలనే విషయమై అవగాహన కలిగిస్తామని వివరించారు. పిల్లలను దత్తత తీసుకున్న తర్వాత రెండేండ్లపాటు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నాలుగుసార్లు విజిట్ చేసి (పోస్ట్ అడాప్షన్ ఫాలోఅప్ ద్వారా) పిల్లల పరిస్థితి ఎలా ఉన్నదో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వేలమందికిపైగా తల్లిదండ్రులు పిల్లల దత్తత కోసం దరఖాస్తులు చేసి వేచి చూస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం సాధారణ పిల్లలు 38 మంది ఉన్నారని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు 100 మంది ఉన్నారని తెలిపారు. పిల్లల దత్తత కోసం ఎదురు చూసే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ (పీఏపీ)కు అడాప్షన్ హెల్ప్డెస్ కౌన్సెలింగ్ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హోలీకేరి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.