హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగం సిద్ధించిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్ డీఎస్ఎస్ భవన్లో కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్ముండాతో కలిసి రాంజీ మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడంఫైటర్ మ్యూజియానికి శంకుస్థాపన చేసిన మంత్రి .. డీఎస్ఎస్ భవన్లో రూ.6.5 కోట్లతో నిర్మించిన ట్రైబల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగుకు నూతనంగా మంజూరైన సమ్మక-సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో 30 శాతం సీట్లు గిరిజన విద్యార్థులకు కేటాయించాలని, సమ్మక-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి అదనంగా మరో 22 ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పెంచిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ను పార్లమెంట్లో వెంటనే అమోదించి చట్టం చేయాలని కోరారు. గిరిజన ఆదివాసీ బిడ్డల దశాబ్దాల కలను సీఎం కేసీర్ సాకారం చేశారని పేర్కొన్నారు. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, సుమారు 11 వేల మంది గిరిజనులు పాలకులుగా తమ గ్రామాలను సమర్థవంతంగా పాలించుకుంటున్నారని పేర్కొన్నారు. పీఎంపీవీటీజీ మిషన్లో భాగంగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని, అందులో భాగంగా గృహానిర్మణాల ఖర్చును రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కార్యదర్శి అనిల్కుమార్కి అధికారులతో కలిసి స్వయంగా వినతిపత్రం అందజేశారు.
కల్చరల్ రిసెర్చ్ ట్రైబల్ ఇనిస్టిట్యూట్
గిరిజన జాతరలు, పండుగలను వీడియో డాక్యుమెంట్ చేయడంతోపాటు గిరిజన సంఘాల సంస్కృతీసంప్రదాయాలను టీసీఆర్టీఐ (గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్ధ) ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు కనకరాజు, రామచంద్రయ్య మార్గదర్శకత్వంలో టీసీఆర్టీఐ ఆధ్వర్యంలో గుస్సాడి నృత్య పాఠశాల, డోలి సంగీత పాఠశాల స్థాపించినట్టు తెలిపారు.
ఆత్మగౌరవ భవనాల నిర్మాణం
తెలంగాణలోని బంజారాల ఆదీవాసీ ఆత్మ గౌరవాన్ని సమున్నతంగా చాటేలా రాష్ట రాజధాని నడిబొడ్డున బంజారాహిల్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి రూ.50 కోట్లతో సంత్సేవాలాల్ బంజారా భవన్, కొమురంభీమ్ ఆదీవాసీ భవన్లను నిర్మించినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గిరిజనుల విద్య కోసం 188 గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో ప్రైవేటుకు దీటుగా విద్య అదిస్తున్నట్టు పేర్కొన్నారు. మేడారం సమ్మక-సారలమ్మ జాతరను ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.400 కోట్లతో భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించినట్టు కేంద్ర మంత్రి అర్జున్ముండాకు మంత్రి సత్యవతి రాథోడ్ వివరించారు.
అట్టహాసంగా గిరిజన జాతరలు
గిరిజన ఉత్సవాలు గోండు, నాగోబా, కొమురం భీం, జంగూబాయి జాతరలు, లంబాడాల శ్రీ సంత్ సేవాలాల్ జయంతి, చెంచుల బౌలాపూర్, ఎరుకుల నాంచారమ్మ, నాయకపోడుల గాంధారిమైసమ్మ, కొలాముల పండుగలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కార్యదర్శి అనిల్కుమార్, జాయింట్ సెక్రటరీ నవల్జీత్ కపూర్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినాజెడ్ చొంగ్తు, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ, జీడీలు కల్యాణ్రెడ్డి, సమూజ్వల, డీడీలు చందన, ప్రియాంక, ఈఈ జగజ్యోతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
రూ. 35 కోట్లతో భవన నిర్మాణం
రాంజీగోండు మ్యూజియం కోసం ప్రభుత్వం హైదరాబాద్లోని అబిడ్స్లో రూ.100 కోట్ల విలువైన 30 గుంటల స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణం కోసం రూ. 10 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించిందని, మొత్తంగా రూ. 35 కోట్లతో భవనాన్ని నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.అనంతరం సంక్షేమ భవనం ప్రాంగణంలో రూ.6.5 కోట్లతో నిర్మించిన టీఆర్ఐ (ట్రైబల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్) భవనాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.