హైదరాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల గురుకులాలు దేశానికి తలమానికంగా మారాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati rathod) వెల్లడించారు. ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు సమ్మర్ క్యాంపుతో పాటు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహణ పోస్టర్ల(Posters)ను మంత్రుకొప్పుల ఈశ్వర్తో కలిసి హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 6వ తేదీ వరకు సమ్మర్ క్యాంపులు(Summer Camps) జరుగుతాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 91 గురుకులాలు ఉంటే ప్రత్యేక రాష్ట్రంలో అదనంగా మరో 94 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. గురుకులల్లో చదివే విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) విద్యాసంస్థల్లో సీట్లు పొందుతున్నారని స్పష్టం చేశారు. కొవిడ్(Covid) కారణంగా మూడు సంవత్సరాలుగా నిలిపివేసిన సమ్మర్ క్యాంపులను ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం 45 చోట్ల సమ్మర్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి కేంద్రంలో వంద మంది గిరిజన విద్యార్థులు, వందమంది సాంఘిక సంక్షేమ విద్యార్థులు పాల్గొంటారన్నారు.
15 రోజుల పాటు జరిగే సమ్మర్ క్యాంపులు ఏప్రిల్ 22న ప్రారంభమై మే నెల ఆరవ తారీకు వరకు కొనసాగనున్నాయని అన్నారు. విద్యార్థులకు సంగీతం, నాట్యం ,పెయింటింగ్, రేఖా చిత్రం ,చిత్రలేఖనం ,భాష నైపుణ్యాలు ,వాయిద్యాలు, కోడింగ్, డ్రోన్ తయారు చేయుట, క్రికెట్ కామెంట్రీ, వ్యక్తిత్వ వికాసం, బొమ్మల తయారీ ,ఆర్టిఫిషియల్ నగల తయారీ( జువెలరీ మేకింగ్) వంటి అంశాలలో మెలకువలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. చెస్, క్రికెట్ ,బాస్కెట్ బాల్ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 26 నుంచి 15 కేంద్రాలలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.