సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): మహిళలు, యువతుల వెంటపడుతున్న వారిపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ నెలలో 97 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన సైబరాబాద్ షీ టీమ్స్ 12 ఫిర్యాదులపై క్రిమినల్, పెట్టీ కేసులను నమోదు చేయగా, 65 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, 18 మందిపై ఈ పెట్టీ కేసులు పెట్టారు. షీ టీమ్స్కు పట్టుబడిన వారంతా మహిళలను అసభ్యకరంగా తాకడం, ఫోన్లో వేధించడం, వాట్సాప్ల్లో అభ్యంతకరమైన ఫొటోలు, వీడియోలు పెట్టడం, ఒంటరిగా ఉన్న మహిళల ఇంట్లోకి బలవంతంగా చొరబడి గలీజుగా వ్యవహరించడం, బహిరంగ ప్రదేశాల్లో యువతులను ఈవ్టీజింగ్ చేయడం వంటి తప్పులు చేశారు. వీటిపై బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో ఆకతాయిలు దొరికిపోయారు. వీటితో పాటు ఈ నెలలో సైబరాబాద్ షీ టీమ్స్ 3 బాల్య వివాహాలను నివారించారు. బాధితులు ఫోన్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, నేరుగా వచ్చి షీ టీమ్స్ను ఆశ్రయించడంతో వారికి పోకిరీల నుంచి ఉపశమనం లభించింది. కావునా మహిళలు, యువతులు, విద్యార్థినులు వారిపై జరిగే అఘాత్యాలపై మౌనంగా ఉండకుండా డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నం. 9490617444కు సమాచారం అందించాలని షీ టీమ్స్ అధికారులు కోరుతున్నారు.