హైదరాబాద్ : నీట్ ఫలితాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు. గత ఏడాది 35 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధిస్తే..కరోనా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు పొందడం వారి కృషి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు.
ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే ఏడాది వందమందికిపైగా మెడిసిన్ సీట్లు సాధించాలనే లక్ష్యంతో కష్టపడాలన్నారు. సీఎం కేసీఆర్ విద్య ద్వారానే వికాసం లభిస్తుందని నమ్మి, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నారని, వాటి ఫలితాలు మనం ఇప్పుడు అనుభవించడం ఆనందంగా ఉందన్నారు.
గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు మూలమైన ముఖ్యమంత్రి కేసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించడంలో భాగంగా రాజేంద్రనగర్ స్టడీ సర్కిల్ లో ఆపరేషన్ ఎమరాల్డ్ పేరుతో ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గత ఏడాది 447 మార్కులు అత్యధిక స్కోర్ సాధించగా…ఈ సంవత్సరం 563 మార్కులు పొంది గిరిజన విద్యార్థులు తమ సత్తా చాటారన్నారు. బి. తరుణ్ అనే విద్యార్థి ఈ 563 మార్కులతో అగ్రస్థానం సాధించడం, మరో 23 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.