హైదరాబాద్ : పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 22 మంది కూలీలు పొలాల్లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే సీఎస్తో మాట్లాడి వారిని రక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కూలీలను రక్షించాయి. ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. వ్యవసాయ కూలీలకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి పది కిలోల బియ్యంతో పాటు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కూలీలను రక్షించేందుకు నిరంతరం శ్రమించిన కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తండాకు రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. కూలీల ఆరోగ్య రీత్యా హెల్త్క్యాంప్ ఏర్పాటు చేయించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాలతో వాగులు, కల్వర్టులపై వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు అండగా ఉంటామన్నారు.