హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పష్టంచేశారు. ఓ బాలికపై లైంగికదాడి, హత్య కేసులో సంగారెడ్డి ఫోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులకు జీవితఖైదు విధించిందని, ఈ తీర్పు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కనువిప్పు కలిగించాలన్నారు. కోర్టు తీర్పును ఆమె స్వాగతించారు. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడకుండా నిరోధిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీటీమ్స్, భరోసా, షీ సైబర్ల్యాబ్లు సమర్థమంతగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు హెచ్చరించేలా ఉన్నదని తెలిపారు. అమీన్పూర్ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ కేసు విచారణలో పోలీసుల పనితీరును, స్త్రీ, శిశు సంక్షేమశాఖ సిబ్బంది, న్యాయాధికారుల కృషిని మంత్రి అభినందించారు.