హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తమిళిసై గవర్నర్గా కాకుండా బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నారా? అన్న అనుమానం కలుగుతున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆదివాసి ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతిని కాకుండా బీజేపీ నేతలను కలిసి రాజకీయాలు మాట్లాడటం లేదంటే ఎలా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలను కలిసిన తరువాత తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదని హితవుపలికారు. సీఎం కేసీఆర్కు మహిళలంటే ఎనలేని గౌరవమని, మహిళలను తోబుట్టువులా చూసుకొంటారని చెప్పారు. తాను తలుచుకొంటే ప్రభుత్వం కూలిపోతుందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఢిల్లీలో మాట్లాడిన తీరు చూస్తుంటే తమిళిసై మనసులో ఏమున్నదో, తెలంగాణ ప్రజలకు అంతా అర్థమైందని తెలిపారు. ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పాల్సి ఉండే, కానీ ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమిళిసై వ్యాఖ్యలు గవర్నర్గా మాట్లాడినట్టు తాము భావించడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకొన్న 100కు పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారు? అని తమిళిసైని నిలదీశారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే ఏం జరిగిందో గుర్తుచేసుకోవాలని సూచించారు.
త్వరలోనే గిరిజనుల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం
భావితరాలకు గిరిజనుల సంసృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆదివాసి, బంజారా భవనాలను నిర్మించిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ భవనాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని గిరిజనుల భవనాలను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, రాంచంద్రు నాయక్, దీప్లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆఫీస్గా రాజ్భవన్ : సీపీఐ కార్యదర్శి నారాయణ
తెలంగాణ రాజ్భవన్ బీజేపీ కార్యాలయంగా మారిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా విమర్శించారు. అసలు గవర్నర్ వ్యవస్థే.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలకు సహకరించేలా మారిపోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన గవర్నర్ తీరుపై ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణ సీఎం ఎప్పుడైతే బీజేపీతో యుద్ధం చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి రాజ్భవన్కు ప్రగతి భవన్కు మధ్య దూరం పెరిగిందని చెప్పారు. రాజ్భవన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని ఆరోపించారు. గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి తెలంగాణలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అమిత్షాకు ఫిర్యాదు చేయడాన్ని ప్రస్తావిస్తూ అసలు మన దేశానికి గంజాయి సరఫరా అవుతున్నదే గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి అని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి గంజాయి తీసుకొచ్చి మత్తు పదార్థాలుగా మార్చి దేశం మొత్తం అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారని విమర్శించారు. అలాంటి రాష్ట్రంలో ఎంపీగా ఉన్న అమిత్షాకు గవర్నర్ తమిళిసై తెలంగాణ గురించి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ నాయకురాలిగా నిరూపించుకొన్న గవర్నర్ రాష్ట్రంలో తనకు సరైన మర్యాద ఇవ్వడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు.
గవర్నర్ వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై కల్పితాలతో, వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ శుక్రవారం మంత్రి తన ఇంటిపై నల్లాజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉగాది సందర్భంగా యాదాద్రికి వెళ్లిన గవర్నర్ 20 నిమిషాలు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ప్రొటోకాల్ పాటించడం కష్టంగా ఉంటుంది. అయినా యాదగిరిగుట్ట చైర్మన్ గవర్నర్కు స్వాగతం పలికారు. పర్యటకు వెళ్తే రెండ్రోజులు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది’ అని మంత్రి స్పష్టం చేశారు. తాను తలుచుకొంటే అసెంబ్లీ రద్దయ్యేదని గవర్నర్ వ్యాఖ్యానించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నర్గా పనిచేసిన రామ్లాల్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టారని, ఆయనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పలేదని మంత్రి గుర్తుచేశారు. గవర్నర్ నోరుపారేసుకోవడం మానుకొని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు.
కేసీఆర్ను ప్రజలు ఎన్నుకొన్నారు : కే నాగేశ్వర్
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్ శుక్రవారం స్పందించారు. ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొన్నారు. ఆయన్ని ఇంటికి పంపించడానికి గవర్నర్ ఎవరు? వాళ్లను ఎవరు పరిపాలించాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొంటారు. కేంద్ర ప్రభుత్వం కాదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.