హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ఐదేండ్లుగా మూలకు పడేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని సహా, పలువురు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చినా తెలంగాణకు వచ్చిన లాభమేమీలేదని అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారని చెప్పారు.
కేంద్రం నిర్లక్ష్యంగా కారణంగా రాష్ట్రంలోని గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి, సాంకేతికంగా అన్నింటినీ సమకూర్చినా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 991 మంది గురుకుల విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన వివిధ కాలేజీల్లో మెడిసిన్ , ఇంజినీరింగ్ సీట్లు సాధించడం గర్వంగా ఉన్నదని, అందుకు కృషి చేసిన అధ్యాపక సిబ్బందిని అభినందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ముర్ము రాష్ట్రపతి అయితే గిరిజనులకు న్యాయం జరుగుతుందా?
గిరిజన మహిళ రాష్ట్రపతిగా వస్తే స్వాగతిస్తామని, అయితే రాష్ట్రపతి అభ్యర్థి వల్ల గిరిజనులకు.. న్యాయం జరుగుతుందా? అని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిని ఇస్తున్నారని విమర్శించారు. ముర్ము రాష్ట్రపతి అయితే దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులకు న్యాయం జరుగుతుందా? అని నిలదీశారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ, వారిని మోసం చేస్తున్నారని అన్నారు.