హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా కేంద్ర మంత్రులు అన్నీ తామే చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకొంటున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని, అసత్యాల ఆర్థిక మంత్రిగా నిర్మల చరిత్రలో నిలిచిపోతారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి పోయిందెంత? కేంద్రం తిరిగి రాష్ర్టానికి ఇస్తున్నదెంత? అనేది నిర్మల చెప్తే బాగుండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కేంద్రం కాపీ కొడుతున్నదన్నారు. వాస్తవాలను పక్కనపెట్టి నిర్మల తన స్థాయిని తగ్గించుకున్నారన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం కేంద్ర పథకమే అయితే ఇతర రాష్ర్టాల్లో ఎందుకులేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి హోదాలో ఉంటూ కేవలం ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితమై వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. విభజన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో నిర్మల చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఇంకా ఎందుకు తొక్కిపెడుతున్నదని నిలదీశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయనకు అసలు అవగాహనే లేదని, అందుకే ప్రభుత్వంపై ఇష్టారీతిగా నోరుపారేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డగా కిషన్రెడ్డి రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.