వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా నేడు వరంగల్, 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కల్పనా బానోత్కు మద్దతుగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలు కలిసి ఇంటింటికి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2వ డివిజన్ అభ్యర్థి కల్పనా బానోత్ను నిండు మనసుతో ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు. ఎన్నికలు రాగానే ఓట్లకోసం అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. కానీ ఎవరికీ ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయనేది ఆలోచించాలి. ఓటేసే ముందు ఆలోచించాలి అని ఆమె సూచించారు. పేదల సంక్షేమం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ వరంగల్ నగరమంటే సీఎం కేసీఆర్కు అత్యంత ప్రేమ ఉండడం వల్లే ఈ నగర అభివృద్ధికి నేరుగా బడ్జెట్లో ఏటా రూ. 300 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తున్నారు అని స్పష్టం చేశారు. రూ. 1600 కోట్లతో మిషన్ భగీరథ ప్రారంభించి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నారు అని తెలిపారు.
ఇక్కడున్న వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మీ సొంతం ఇంటి స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకోవాలనుకునే వారికి త్వరలోనే డబ్బులు ఇస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని తేల్చిచెప్పారు. మనకు వరదలు వచ్చినపుడు, కరోనా వచ్చినపుడు ప్రజలను పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి అని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.