బడంగ్పేట ( వికారాబాద్ ) : మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడుతో పాటు నాలుగు వందల మంది బీఆర్ఎస్ ( BRS )లో చేరారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ జెఎన్ఎన్యూఆర్ కాలనీలో బీజేవైఎం స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్, వనపర్తి జిల్లా బీజేపీ ఇన్చార్జి టేకుల భాస్కర్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కండ్లులేని కబోదులకు కన్పించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒకాయన కరెంటు తీగలకు బట్టలు ఆరేసుకోవాలని అంటే, మరొకరు మూడు గంటలు చాలని అనడం శోచనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏమి మాట్లాడాలో వారికే తెలియడం లేదని విమర్శించారు.
గతంలో విద్యుత్, తాగునీటి సమస్యతో ప్రజలు అష్టకష్టాలు పడగా నేడు ఆ బాధలు లేవని పేర్కొన్నారు. మిషన్ భగీరథ (Mission Baghiratha) ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందుతున్నాయన్నారు. రెండు వందలు ఉన్న ఫించన్ ఇప్పుడు మూడు నుంచి నాలుగు వేలు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి పేద వాడికి వైద్యం అందించాలన్న సంకల్పంతో బస్తీ దవాఖానలు, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు, దళితులకు దళితబంధు (Dalit Bandu) తో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ రోహిణి రమేష్, మాజీ సర్పంచ్ బాలమణి, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, యాతం పవన్ కుమార్, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.