Education Day | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారంగా రాగిజావా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వారం మూడు రోజుల పాటు ఇవ్వనున్నారు. ప్రార్థనా సమయానికి ముందు విద్యార్థులకు 250 మిల్లీ లీటర్ల రాగిజావను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25.26లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
సచివాలయంలోని కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్షించారు. జూన్ 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మన ఊరు -మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కింద సకల వసతులతో ఆధునికీకరించిన వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. రాష్ట్రంలోని ఒకటి నుంచి 5వ తరగతి చదువుతున్న 16.27లక్షల మందికిపైగా విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్ బుక్స్, ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న 12.39 లక్షల మంది విద్యార్థులకు సబ్జెక్టు ఒక్కో నోట్ పుస్తకం చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు, సమాచార బదలాయింపు కోసం రాష్ట్రంలోని 20వేల మంది ఉపాధ్యాయులకు టాబ్లను అందించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 1600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్ తరగతులను విద్యా దినోత్సవం ప్రారంభించించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 20న నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సభలు, సమావేశాలను నిర్వహించి రాష్ట్రంలో విద్యారంగంలో సాధించిన విజయాలను వివరించాలని సూచించారు.
అలాగే 10వేల గ్రంథాలయాలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రూ.190 కోట్లు ఖర్చు చేసి 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. 26లక్షల మంది విద్యార్థులకు రూ.150 కోట్లు వెచ్చించి ఒక్కో విద్యార్థికి రెండేసి జతల యూనిఫామ్ను అందిస్తున్నామని మంత్రి వివరించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.