ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్లో 68.68శాతం, సెకండియర్లో 71.57 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్లో 61.68 శాతం, సెకండియర్లో 63.49 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యా యి. మంగళవారం ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయం లో విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లోను బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ వారే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించి, సత్తాచాటారు. ఫస్టియర్లో 68.68 శాతం, సెకండియర్లో 71.57 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫస్టియర్లో 54.66 శాతం మంది, సెకండియర్లో 55.60 శాతం మంది బాలు రు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్లో 61.68 శాతం, సెకండియర్లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థు లు మరింతగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది 9.45 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1,473 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని రద్దు చేశామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి వరకు అవిశ్రాంతంగా పనిచేసిన ఇంటర్ బోర్డు అధికారులను అభినందించారు. విద్యార్థులు ఒత్తిడిని దూరం చేసుకొనేందుకు 14416 టెలిమానస్ హెల్ప్లైన్ను సంప్రదిస్తే ఉచితంగా సేవలు లభిస్తాయని బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ తెలిపారు.
గురుకులాల్లో 92 శాతం పాస్
ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు దుమ్ములేపాయి. గురుకుల కాలేజీల్లో (టీఎస్ఆర్జేసీ) ఏకంగా 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు 63 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. దాదాపు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు అంతకుమించి ఫలితాలు నమోదు చేశాయి. గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటడం పట్ల ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బోధనా సిబ్బందిని అభినందించారు.
సత్తాచాటిన గురుకుల విద్యార్థులు వీరే..
ఈ ఏడాది స్వల్పంగా తగ్గిన ఉత్తీర్ణతశాతం
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ఈ ఏడాది ఉత్తీర్ణతశాతం నిరుడితో పోల్చితే స్వల్పంగా తగ్గింది. ఈ ఏడాది ఇంటర్లో 100 శాతం సిలబస్ను అమలుచేశారు. ప్రశ్నల్లో గతేడాది 75 శాతం చాయిస్ ఇవ్వగా, ఈ ఏడాది చాయిస్ లేకుండా ఎప్పటిలాగే ప్రశ్నలిచ్చారు. దీంతోనే ఉతీర్ణతశాతం కాస్త తగ్గినట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు జూన్ 9తో ముగుస్తాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు బుధవారం (ఈ నెల 10) నుంచి 16 వరకు పరీక్ష ఫీజును తమ కాలేజీల్లో చెల్లించవచ్చు. మంగళవారం సాయంత్రం నుంచి కలర్ మెమోలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. విద్యార్థులు ఈ నెల 16 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇంటర్బోర్డు వెబ్సైట్ను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 040 -24600110, 24655027 నంబర్లలో సంప్రదించవచ్చు.
సైన్స్లో భళా.. ఆర్ట్స్లో డీలా
ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే సైన్స్లో విద్యార్థులు భళా అనిపించగా, ఆర్ట్స్లో డీలా పడ్డారు. అత్యంత సులభమని భావించే హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో అత్యధికశాతం మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ఈ రెండు కోర్సుల్లో పరీక్షలకు హాజరైన వారి వివరాలను పరిశీలిస్తే పాస్ పర్సంటేజీ తక్కువగా ఉంది. కఠినంగా ఉండే ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ఎంఈసీలో పాస్ పర్సంటేజీ ఆశాజనకంగానే ఉంది. కోర్సులవారీగా తీసుకుంటే ఎంపీసీలోనే అత్యధికులు పాస్కాగా, ఆ తర్వాత బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీల్లో ఉత్తీర్ణత సాధించారు.
‘ఏ’ గ్రేడ్లోనే ఎక్కువ మంది పాస్
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు మంచి మార్కులతోనే పాస్కావడం విశేషం. ఈ ఏడాది అత్యధికంగా విద్యార్థులు ఏ- గ్రేడ్తో సత్తాచాటారు. ఇంటర్లో వెయిటేజీ లేకున్నా 75 శాతం కంటే అధికంగా మార్కులు సాధించి, ఔరా అనిపించారు.
గ్రేడ్స్వారీగా ఉత్తీర్ణత (జనరల్, వోకేషన్ కోర్సులు కలిపి)
గ్రేడ్ ఫస్టియర్ సెకండియర్
ఏ 1,75,505 1,91,698
బీ 75,820 64,385
సీ 31,659 21,166
డీ 14,757 7,784
బీసీ గురుకులాలకు ర్యాంకుల పంట
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూ లే బీసీ గురుకుల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంటర్ సెకండియర్లో 86.67 శాతం, ఫస్టియర్లో 78.78 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సెకండియర్ ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో 4,5, 6 ర్యాంకులు, బైపీసీలో 6,7 ర్యాంకులతో బీసీ గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించినట్టు అధికారులు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఇందుకు కృషిచేసిన బీసీ గురుకుల సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు అభినందించారు.
గిరిజన గురుకుల విద్యార్థుల సత్తా
ఇంటర్ ఫలితాల్లో గిరిజన గురుకులాలు మరోసారి మెరిశాయి. ఫస్టియర్లో73.65%, సెకండియర్లో 84.95% ఉత్తీర్ణత నమోదైం ది. అన్నివర్గాల పేద బిడ్డలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడంతో గురుకుల విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.
సత్తాచాటిన సర్కారీ విద్యార్థులు
ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అత్యుత్తమ మార్కులతో అదరగొట్టారు. ఎంపీసీ సెకండియర్లో కాంజివరం ఎస్వీ వైష్ణవిదేవి 991 మార్కులతో సత్తా చాటింది. బైపీసీలో రోహిణి 990, ఎంఈసీలో వీ మంజుల మంగ్యా చౌహన్ 973 మార్కులు సాధించారు.
ఫస్టియర్లో మేడ్చల్ టాప్.. సెకండియర్లో ములుగు ప్రథమం
మంగళవారం విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అత్యధికంగా 73 శాతం ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్లో ములుగు జిల్లా 85 శాతంతో ప్రథమ స్థానం కైవసం చేసుకొన్నది. అలాగే ఇంటర్ ఫస్టియర్లో 38 శాతం, సెకండియర్లో 52 శాతంతో రెండింటిలోనూ మెదక్ జిల్లా అతి తక్కువ ఉత్తీర్ణత శాతంతో చివరిస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో నిలిచిన జిల్లాలను పరిశీలిస్తే ఫస్టియర్లో మెదక్ కంటే ముందు నారాయణపేట (41 శాతం), జయశంకర్ భూపాలపల్లి (45 శాతం) జిల్లాలు నిలిచాయి. ఇక సెకండియర్లో చివరిస్థానంలో నిలిచిన జిల్లాల్లో మెదక్ కంటే ముందు నాగర్ కర్నూల్ (54 శాతం), వరంగల్ (58 శాతం) జిల్లాలు ఉన్నాయి.
జిల్లాలవారీగా ఉత్తీర్ణతశాతం (టాప్ -5 జిల్లాలు)
స్థానం ఫస్టియర్ (ఉత్తీర్ణతశాతం) సెకండియర్ (ఉత్తీర్ణతశాతం)
గురుకుల ఫలితాలు అద్భుతం: హరీశ్రావు
ఇంటర్ ఫలితాల్లో గురుకుల కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభను చూసి తాను అమితాశ్చర్యానికి గురయ్యానని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. టీఎస్ఆర్జేసీ 92 శాతం, సోషల్ వెల్ఫేర్ 89 శాతం, బీసీ వెల్ఫేర్ 87 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 84 శాతం, టీఎంఆర్జేసీ 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపట్ల ట్విట్టర్ వేదికగా హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తపనకు ఈ అద్భుత ఫలితాలు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ప్రతిభచాటిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. గురుకులాల సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సిబ్బంది కలిసి అద్భుతమైన భవిష్యత్తును తయారు చేస్తున్నామని, యువత ఉన్నత శిఖరాలకు చేరేలా సాధికారత కల్పిస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.