హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. సర్కారు బడుల సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన మన ఊరు – మన బడి స్ఫూర్తిగా ‘మన యూనివర్సిటీ – మన ఉస్మానియా’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడతామని వర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ దండేబోయిన రవీందర్ వెల్లడించారు. వర్సిటీ అభివృద్ధి కోసం రిఫార్మ్ (సంస్కరణ), ఫెర్ఫార్మ్ (పనిచేయడం), ట్రాన్స్ఫార్మ్ (రూపాంతరం) నినాదాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. వీసీగా ఏడాది పూర్తి చేసుకొన్న ఆయన శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మీడియాతో మా ట్లాడారు. సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వీసీ ఓఎస్డీ రెడ్యానాయక్ పాల్గొన్నారు.
వర్సిటీ అభివృద్ధిలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించేందుకు యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేస్తారు. ఓయూ క్యాంపస్ కాలేజీలతో పాటు, నిజాం కాలేజీ, సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజీల్లోనూ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు. నెల లేదా రెండు నెలలకోసారి సమావేశాలను నిర్వహిస్తారు. కాలేజీల వారీగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు వసతులు, కోర్సులపై ఈ కౌన్సిళ్లలో చర్చిస్తారు.
వర్సిటీలో 60 శాతం మంది అమ్మాయిలు ఉన్నారు. పరిపాలన పరమైన పోస్టుల్లో 50 శాతం మహిళా ఆచార్యులనే నియమించారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో షీ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్-సేఫ్టీ, హెచ్-హెల్తీ, ఈ-ఎంపవర్మెంట్ సూత్రంతో ఈ షీ సెంటర్ను నడుపుతారు.
కేంద్రం ఏకపక్షంగా ఎన్ఈపీని రాష్ర్టాలపై రుద్దడం సరికాదు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం. ఎన్ఈపీ అమలుచేస్తున్న కర్ణాటకలోనూ పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. మేము ఎన్ఈపీ సిఫారసులైన క్లస్టర్ సిస్టం, బకెట్ సిస్టంలను ఇప్పటికే అమలు చేస్తున్నాం.
– ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్