హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భయాందోళనలకు, ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శనివారం శుభాకాంక్షలు తెలిపారు. మే 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ సారి 5,09,275, మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, ఈ మేరకు 2,881 కేంద్రాలను ఏర్పాటు వివరించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని చెప్పారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేలా వారి తల్లిదండ్రులు చూడాలన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్షా సమయంలో విద్యుత్ ప్రసారానికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమయినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అధికారులందరూ అందుబాటులో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ప్రతీ జిల్లాకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులందరూ పరీక్షలో విజయం సాధించి వారి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.