హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్యాలయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు, షెడ్యూల్కు సంబంధించి త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్వేర్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.
పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని, ఈ ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. బదిలీ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేలా వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్రస్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న ఉపాధ్యాయ సానుకూల నిర్ణయం విజయవంతమై పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.